నిబంధనలకు విర్ధుంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి : మంత్రి దామోదర్ రాజనర్సింహకు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ, హౌస్సర్జన్ విద్యార్థులకు వెంటనే ఉపకార వేతనాలను ఇవ్వాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉపకార వేతనాలు ఇవ్వని యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నేతలు వినతిపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి.మహేశ్, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పి.మురళి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. రాష్ట్రంలో 27 ప్రయివేటు మెడికల్ కాలేజీలున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 90 ద్వారా హౌస్ సర్జన్లకు ప్రతి నెలా ఉపకార వేతనం రూ.29, 792 ఇవ్వాల్సి ఉండగా కొన్ని కాలేజీలు ప్రభుత్వ నింబధనలను తుంగలో తొక్కి రూ.5 వేలు, రూ.2 వేలు ఇస్తున్నాయని ఎత్తిచూపారు.
విద్యార్థుల ఏటీఎం కార్డులను, బ్యాంకు పాస్బుక్లను తీసుకోవడంతో పాటు ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని కళాశాల యజమాన్యాలు దగ్గరనే పెట్టుకుంటున్న పరిస్థితి గురించి వివరించారు. ఇలా చేసే కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉపకార వేతనాలు, తమ హక్కుల కోసం ప్రశ్నించే విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు తగ్గించడం, అటెండెన్స్ లేదని సాకు చూపెట్టి పరీక్షలకు అనుమతి ఇవ్వకపోవడం, అదనపు డ్యూటీలు వేసి వేధించడం దారుణమన్నారు. అలా చేస్తున్న కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలనీ, అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి సొంతభవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..తక్షణమే అలాంటి కళాశాలల వివరాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.



