నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు . వివరాల్లోకి వెళ్తే పాఠశాలలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు 54 మంది విద్యార్థులు చదువుతున్నారు.
మంగళవారం పాఠశాలకు 48 మంది విద్యార్థులు హాజరు కాగా మధ్యాహ్న భోజనంలో తోటకూర, పెసరి పప్పు చేసి వడ్డించడంతో భోజనం తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై కడుపు నొప్పి,ఛాతి నొప్పితో బాధపడుతూ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ తులసికి వివరించారు. వెంటనే స్థానికులు 108 కు సమాచారం అందించడంతో అంబులెన్సు సహాయంతో విద్యార్థులను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నమూనాలను ప్రయోగశాలకు పంపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపడంతో వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.



