– కోహెడ పాఠశాలలో చదివిన ఉద్యోగులకు సన్మానం
– ఘనంగా వేడుకలు నిర్వహించిన ఉపాధ్యాయులు
నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన పూర్వ విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమూద్, ఉపాధ్యాయుడు, నిర్వాహకుడు కందాల రవిందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోహెడ పాఠశాలలో చదివిన అనంతరం పై చదువులు చదివి ఉద్యోగం సాధించి సమాజానికి మార్గదర్శకంగా ఉండడం పట్ల సన్మానం చేయడంతో పాటు మోటివేషన్గా ఉంటుందని ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించి, సమాజానికి సేవలందించడం పట్ల పలువురు అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఉద్యోగస్థులు మాట్లాడుతూ తమ చిన్నతనంలో పాఠశాలలో చేసిన అల్లర్లను చర్చించుకున్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా బాటలు వేసుకోవాలన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గోన్నారు.
ఇదే పాఠశాలలో చదివి ఇక్కడే పనిచేస్తున్నా- కందాల రవీందర్ (ఉపాధ్యాయుడు)
ఇదే పాఠశాలలో విద్యనభ్యసించి ఇక్కడే ఉద్యోగం చేయడం ఆనందం ఉంది. 2002 సంవత్సరంలో నాకు తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందాను. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈ పాఠశాలలో చదివే విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
