– సర్కారు బడుల్లోని విద్యార్థులకు గురుకులాల తరహా సదుపాయాలు : అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
– కొత్త పాఠశాలలు ప్రారంభించాలి
– విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం
– మౌలిక వసతుల కల్పనలో ఖర్చుకు వెనకాడొద్దు
– పిల్లలకు భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలు నేర్పించాలి
– ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులుండాలి
– విద్యాశాఖపై సీఎం సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందాలనీ, అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు. నాణ్యమైన భోజనం, యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారనీ, సర్కారు బడుల్లోని విద్యార్థులకూ (డే స్కాలర్లకూ) ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పున్ణ ప్రారంభమైన నేపథ్యంలో ఐసీసీసీలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం కోరారు. ఈ క్రమంలో బోధన ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని కోరారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్లో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలంటూ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతోపాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధ్యయనం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES