కేంద్రం నుంచి 5.44 లక్షల మెట్రిక్ టన్నుల రాక
గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నుల అధిక అమ్మకం
ఐదు జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్ ప్రయోగం విజయవంతం
యాప్తో 9 రోజుల్లో 2,01,789 బస్తాల కొనుగోలు : కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రబీ సీజన్కు అవసరమైనంత యూరియా నిల్వ రాష్ట్ర ప్రభుత్వ వద్ద అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కమిషనరేట్ లో టోల్ ఫ్రీ నెం. 18005995779 ఏర్పాటు చేశామన్నారు. ఫెర్టిలైజర్ (యూరియా) యాప్, యూరియా పంపణీలపై కలెక్టర్లతో సోమవారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ రబీకి కేంద్ర ప్రభుత్వం మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 5.70 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని వివరించారు. ఈ సీజన్లో రోజుకు సగటుగా 8,692 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 3.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని, ఇది గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికం అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని చెప్పారు. వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ ను ఆదిలాబాద్, మహబూబ్ నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో అమలు చేయగా.. 82,059 మంది రైతులు ఆ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసి 2,01,789 యూరియా బస్తాలు కొనుగోలు చేశారనీ, కేవలం 9 రోజుల్లోనే ఈ జిల్లాల్లో రోజుకు 22,000కు పైగా బస్తాలు పంపిణీ అయ్యాయని వివరించారు. యాప్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా అధికారులు వెంటనే పరిష్కరించారని రైతులు కూడా యూరియా యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. యాప్ అనేది కేవలం రైతుల సౌకర్యార్థం తెచ్చినది మాత్రమేననీ, దాని ద్వారా యూరియా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పారు. యాప్ అమలులో లేని జిల్లాలలో కూడా యూరియా సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా యూరియా స్టాక్, డిమాండ్, పంపిణీపై జిల్లా కలెక్టర్లు నిశితంగా పర్యవేక్షించాలని, అవసరమైతే అదనపు సేల్స్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యూరియా పంపిణీపై మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించాల్సిందిగా సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలను ఉదయాన్నే తెరిచేలా చర్యలు తీసుకోవాలని, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకొని, సాయంతం జిల్లా అధికారులతో సమీక్ష చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ మాట్లాడుతూ.. ప్రతి పీఏసీఎస్ సెంటర్లలో మూడు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయాలనీ, రైతుల సౌకర్యం కోసం శామియానా, తాగునీరు లాంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ ఫెడ్ ఎమ్డీ శ్రీనివాస్రెడ్డి, కోఆపరేటీవ్ అడిషనల్ రిజిస్ట్రార్ చంద్రమోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



