పాక్షిక ఉపశమనమే…
నవంబర్ 16న ఢిల్లీలో భారీ బహిరంగ సభ
అప్పటి వరకు దేశవ్యాప్త ప్రచారం : ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు నిరాశ కల్పించిందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్పీఎల్బీ) తెలంగాణ రాష్ట్ర శాఖ అభిప్రాయపడింది. ఈ తీర్పు పాక్షిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుందే తప్ప, రాజ్యాంగ సమస్యలను పరిష్కరించదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారంనాడిక్కడి బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బోర్డు తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులు ముక్తీ ఉమర్ ఆబిది, రియాజ్ రిషాదీ, రఫతుల్లా షాహెద్ తదితరులు వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై మాట్లాడారు. సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వు వక్ఫ్ ఆస్తుల హక్కుల్ని కాపాడటం ద్వారా ఉపశమనం కలిగిస్తుందే తప్ప, తుది నిర్ణయం వచ్చేవరకు ఆస్తులను స్వాధీనం చేసుకోలేని అనిశ్చితిలోకి నెట్టేస్తుందని చెప్పారు. కార్యనిర్వాహక అధికారులు విచారణల సమయంలో ఏకపక్షంగా యాజమాన్యాన్ని నిర్ణయించలేరని తెలిపారు. అయితే ప్రభుత్వ అధికారులకు ఏకపక్ష అధికారాలను మంజూరు చేసే నిబంధనలను కూడా కోర్టు నిలిపివేయడం ఊరటకలిగించే అంశమే తప్ప, పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.
చట్టంలోని ‘ఏకపక్ష’ నిబంధనలను ప్రభుత్వ అధికారులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ‘సేవ్ వక్ఫ్’ ప్రచారం నిర్వహిస్తున్నామనీ, నవంబర్ 16న ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సేవ్ వక్ఫ్ ప్రచారాన్ని కొనసాగిస్తామన్నారు. ఆస్తి హక్కుల నిర్ధారణలో అధికారాల విభజనలో కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ కౌన్సిళ్లలో ముస్లిమేతర సభ్యత్వాన్ని పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అలాగే వక్ఫ్ సృష్టించేందుకు ఒక వ్యక్తి కనీసం ఐదేండ్లు ముస్లింగా ఉండాలనే అనే ఏకపక్ష నిబంధనను కూడా కోర్టు నిలిపివేసిందని గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ చట్టం-2025ను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.