నవతెలంగాణ-హైదరాబాద్ : వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు తన గత తీర్పును సవరించింది. వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి, వాటిని రిలీజ్ చేయాలని ఇవాళ అత్యున్నత న్యాయ స్థానం తన తాజా తీర్పులో ఆదేశించింది. ఢిల్లీలో ఎక్కడ నుంచి తీసుకెళ్లిన కుక్కలను, స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని అక్కడే వదిలేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. వీధి కుక్కలను షెల్టర్లలో వేయడం వల్ల.. ఆ షెల్టర్లు కిక్కిరిసిపోయాయని, దాని వల్ల వీధి కుక్కల ఆరోగ్యం ఆందోళనకరంగా మారినట్లు కోర్టు వెల్లడించింది.
వ్యాక్సినేషన్ తర్వాత కుక్కలను రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని కోర్టు పేర్కొన్నది. అయితే దూకుడు ప్రవర్తన ఉన్న కుక్కలను, రేబిస్ వ్యాధితో ఉన్న కుక్కలను పబ్లిక్ స్థలాల్లో వదలవద్దు అని కోర్టు తెలిపింది. అలాంటి కుక్కలను డాగ్ షెల్టర్లలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన తీర్పులో.. వీధికుక్కలను షెల్టర్ హౌజ్లకు తరలించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ తర్వాత వీధి కుక్కలను షెల్టర్ల నుంచి రిలీజ్ చేయాలని ధర్మాసనం తెలిపింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించడం నిషేధించాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు నిర్దేశిత ప్రదేశాలను ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది.