నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రఖ్యాత బోండీ బీచ్లో యూదుల హనుక్కా వేడుకలో జరిగిన కాల్పుల ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా ప్రకటించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఒక తండ్రీకొడుకులని, వీరి వయసు 50, 24 సంవత్సరాలని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ దాడిలో ఇతర నిందితుల ప్రమేయం లేదని కూడా వారు స్పష్టం చేశారు.
న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ మాట్లాడుతూ పోలీసుల ఎదురుకాల్పుల్లో 50 ఏళ్ల తండ్రి అక్కడికక్కడే మరణించగా, 24 ఏళ్ల కొడుకు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. దర్యాప్తులో భాగంగా సిడ్నీ శివార్లలోని బోనీరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో ఉన్న రెండు ఇళ్లపై దాడులు చేసి సోదాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
మరణించిన 50 ఏళ్ల వ్యక్తి లైసెన్సుడ్ గన్ హోల్డర్ అని, అతడి పేరు మీద ఆరు తుపాకులు రిజిస్టర్ అయి ఉన్నాయని కమిషనర్ నిర్ధారించారు. దాడిలో బహుశా అవే ఆయుధాలను వాడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలం సమీపంలో రెండు శక్తివంతమైన బాంబులను (IEDs) కూడా కనుగొని నిర్వీర్యం చేసినట్లు ఆయన వెల్లడించారు.
దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటనా స్థలంలో ఐసిస్ జెండా లభించిందన్న వార్తలపై ఆయన స్పందించలేదు. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసు అధికారులు ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రార్థనా స్థలాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.



