గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ హెచ్చరిక
విద్యా రంగం పేరుతో దోపిడీకి అడ్డుకట్టగా చట్టం తేవాలి
గిరిజన సంఘం సమావేశం తీర్మానం
నవతెలంగాణ – కరీంనగర్ : జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను నట్టేట ముంచే విధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒలింపియాడ్, ఇంటర్నేషనల్, టెక్నో, లిటిల్ ఫ్లవర్ వంటి ముద్దు పేర్లతో పాఠశాలలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నాయని విమర్శించారు.
అడ్మిషన్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, బుక్స్, యూనిఫాంలు ఇలా ఒక్కో అంశం పేరుతో లక్షల్లో వసూలు చేస్తున్నాయని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యకు కొంతమంది కార్పొరేట్ కాలేజీలు ఏడాదికి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఫీజుల నియంత్రణ కోసం సోమేశ్ కుమార్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం పాటించడం లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అనుమతులు లేని, సదుపాయాలు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి ఉద్యమానికి దిగతామన్నారు. సమావేశంలో సంఘ నాయకులు శివకుమార్, సింహాద్రి, రమేష్, ప్రకాష్ నాయక్, సురేష్, లక్పతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.