నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించి, మెమొంటోలను అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గుండోజి దేవేందర్ మాట్లాడుతూ… విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతార బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. ఉపాధ్యాయుడు సమాజానికి దిక్సూచి అనీ, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి చక్కని సమాజాన్ని నిర్మిస్తాడని పేర్కొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని ఇచ్చి జీవితంలో ఎదిగేందుకు తోడ్పాటున అందిస్తాడన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సౌమ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.