ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ ఓ గేమ్ ఛేంజర్
టెక్నాలజీ డిగ్రీలకే పరిమితం కావొద్దు
దేశసేవ, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలి : బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ‘ఇన్నోవేషన్ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, దేశసేవకు, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలని సూచించారు. శనివారం బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించిన ‘బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ -2026’లో మంత్రి మాట్లాడారు. ఇతర దేశాల్లో ప్రయివేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తే, భారత్ మాత్రం ఆధార్, యూపీఐ వంటి ‘డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల ద్వారా ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోందన్నారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డేటా పరిశోధనలకు గొప్ప ఊతమిస్తోందని చెప్పారు.
త్వరలో ప్రారంభించబోయే ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ’ గేమ్ ఛేంజర్గా మారి, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలవబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ‘ఇంటెలిజెన్స్ కంటే ‘కో-ఆర్డినేషన్లు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయన్నారు. ఏఐ వినియోగంలో డేటా ప్రైవసీ, ఎథిక్స్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఆ దిశగా ఆర్ అండ్ డీపై దృష్టి సారించాలని టెక్ కంపెనీలను కోరారు. ఒకప్పుడు స్కేల్, స్పీడ్, వాల్యూయేషన్ ప్రాతిపదికన కంపెనీల సక్సెస్ రేట్ ఉండేదనీ, ఇప్పుడు ఆర్కిటెక్చర్, డేటా ఓనర్షిప్, డెసిషన్ స్పీడ్ వంటి అంశాలపైనే వాటి మనుగడ ఆధారపడి ఉందని చెప్పారు.
రాబోయే రోజుల్లో కేవలం కోడింగ్ తెలిసిన వారి కంటే, సమస్య మూలాలను గుర్తించి పరిష్కరించగల క్రియేటివ్ థింకర్స్కే మార్కెట్లో ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. ‘ఏఐ’ ఫలితాలు కేవలం నగరాలకే పరిమితం కాకూడదని చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లోని గ్రామీణ సమస్యలకు పరిష్కారం చూపేలా పరిశోధనలు జరగాలన్నారు. అప్పుడే టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు కూడా అందుతాయని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్లో భాగస్వామ్యం కావాలని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను, యాజమాన్యాన్ని ఆయన ఆహ్వానించారు. ఏఐ, ఇన్నోవేషన్, అకాడమిక్ రీసెర్చ్ వంటి అంశాల్లో బిట్స్ పిలానీతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ చైర్పర్సన్ ప్రేమ్జైన్, మ్యాప్ మై ఇండియా ఫౌండర్ అండ్ చైర్మెన్ రాకేష్ వర్మ, బీజీఎం 2026 చైర్పర్సన్ అనిత తదితరులు పాల్గొన్నారు.



