నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డితో పాటు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలను రాజ్యసభకు అభ్యర్ధులుగా ఎంపిక చేసింది. వీరిద్దరూ ఈరోజు తమ నామినేషన్లు సమర్పించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయంగా అండగా నిలుస్తున్న వేం నరేందర్రెడ్డికి పార్టీ విధేయతకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. మరోవైపు, జాతీయ రాజకీయాల్లో, పార్లమెంటులో అభిషేక్ మను సింఘ్వీ అనుభవం, న్యాయపరమైన నైపుణ్యం పార్టీకి అవసరమని భావించి అధిష్టానం ఆయనను మరోసారి ఎంపిక చేసింది. అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ జామ్ మీటింగ్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇద్దరి పేర్లను ఖర్గే ఖరారు చేశారు.



