నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందు కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కొరకు ఒక్కొక్కటి సుమారు రూ.17.50 లక్షల వ్యయంతో మొత్తం రూ.5 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.. తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 12 అడుగులు, క్రింద ఉన్న దిమ్మె 6 అడుగులు మొత్తం కలిపి భూమిపై నుంచి 18 అడుగులు ఉండనుంది. తెలంగాణ తల్లి రూపము సాంప్రదాయ పల్లెటూరి మహిళా రైతుగా, స్త్రీ మూర్తిగా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీకున తెలంగాణ తల్లి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 27 కలెక్టరేట్ల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా, మంత్రులతో కలసి ప్రారంభోత్సవం చేస్తారు.



