Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇండియా 'ఏరోస్పేస్‌ రాజధాని'గా తెలంగాణ

ఇండియా ‘ఏరోస్పేస్‌ రాజధాని’గా తెలంగాణ

- Advertisement -

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణను ఇండియా ‘ఏరోస్పేస్‌ రాజధాని’గా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఫిక్కీ తెలంగాణ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కమిటీ సహకారంతో శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో మేధోమథనం నిర్వహించారు. తెలంగాణ ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్‌ ప్రణాళికలపై సలహాలు, సూచనలు ఈ సందర్భంగా వారి నుంచి స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏరోస్పేస్‌ ఎకోసిస్టం బలోపేతానికి 60 ఏండ్ల కిందటే బలమైన అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. ”30కి పైగా ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ ఓఈఎంఎస్‌లు, వేయికి పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. డీఆర్డీవో, హాల్‌, జీఎంఆర్‌, టాటా, అదానీ ఎల్బిట్‌, సాఫ్రాన్‌, బోయింగ్‌-టీఏఎస్‌ఎల్‌ జేవీ వంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉంది. రాష్ట్ర ఏరోస్పేస్‌ ఎగుమతుల విలువ రూ. 28,000 కోట్లకు పైగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

ఈ ప్రక్రియలో సంబంధిత పరిశ్రమలు, నిపుణు లను భాగస్వామ్యం చేస్తున్నాం’ అని శ్రీధర్‌బాబు వారికి వివరించారు. ‘ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌ తరహా లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఫేజ్‌-2 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ క్లస్టర్‌ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక ఏరోస్పేస్‌ ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్‌ను గ్రీన్‌ ఏవియేషన్‌ హబ్‌గా తీర్చి దిద్దేలా డ్రోన్‌ టెక్నాలజీ, గ్రీన్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్స్‌ రంగాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం’ అని చెప్పారు. పారిశ్రామి కాభివృద్ధి, అనుమతుల్లో జాప్యం తలెత్తకుండా అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏరోస్పేస్‌ రంగంలో స్కిల్డ్‌ వర్కర్ల కొరతను తీర్చేందుకు ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను దత్తత తీసుకోవాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. ఈ కార్యక్రమం లో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, హెచ్‌సీ రోబోటిక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డా.రాధాకృష్ణ, ఫిక్కీ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ హెడ్‌ రాజీవ్‌ జూలకంటి, కో-ఛైర్మన్‌ జయదేవ్‌ మీలా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -