నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (64) ఈ రోజు అకస్మాత్తుగా కన్నుమూశారు. అందెశ్రీ మరణ వార్త తెలిసి సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందె శ్రీ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీ తో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలింది అంటూ.. ఆయన మరణం పట్ల సీఎం సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఈ విషాద సమయంలో అందెశ్రీ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.



