– బారికేడ్లు, ముళ్లకంచెలు, రహదారులపై గోతులు
– నగరాన్ని దిగ్బంధించిన పోలీసులు
– ఆంక్షలు పెట్టినా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
– పోలీసుల లారీచార్జ్జి
నెల్లూరు: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన ఉద్రికత్తల నడుమ సాగింది. ఆంక్షల వలయంలో నగరాన్ని దిగ్బంధించారు. అడుగడుగునా బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మెయిన్రోడ్డులోకి ప్రజలు ఎవ్వరూ రాకుండా కొత్తూరు, అయ్యప్పగుడి, ఆస్పత్రి రోడ్డు, వేదాయపాళెం, పొదలకూరు రోడ్డులో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. కోవూరు టౌన్లోకి ఎవ్వరూ ప్రవేశించకుండా మట్టిరోడ్డును జెసిబితో గుంతలు తవ్వారు. ఉదయం నుంచి నగరంలోనికి ఎవరినీ రానివ్వలేదు. జగన్ నగరానికి చేరుకున్న కొద్దిసేపటికే అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆటోలు, వాహనాల మీదుగా పెద్దఎత్తున్న నగరంలోకి తరలివచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బారికేడ్లను తోసుకుంటూ వైసిపి అభిమానులు, కార్యకర్తలు ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. పోలీసులపై కార్యకర్తలు పడిపోవడంతో ఓ కానిస్టేబుల్కు చెయ్యి విరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
విషయం తెలుసుకున్న ప్రసన్నకుమార్రెడ్డి అక్కడి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆర్అండ్బి గెస్ట్హౌస్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. జగన్ వచ్చే వరకూ అక్కడే ధర్నా చేశారు. ఆయన రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.గురువారం ఉదయం పది గంటలకు కొత్తూరులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జగన్ను కలిసేందుకు అతికొద్ది మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. అక్కడి నుంచి నెల్లూరు సెంటర్ జైలుకు చేరుకున్నారు. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డితో 30 నిమిషాల పాటు జగన్ ములాఖత్ అయ్యారు.
జగన్ పర్యటనలో ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -