3-2తో బెంగళూరుపై ఘన విజయం
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో ఆతిథ్య జట్టు హైదరాబాద్ బ్లాక్హాక్స్ అదరగొట్టింది. సీజన్లో వరుసగా ఐదు విజయాలు సాధించి అజేయంగా నిలిచిన బెంగళూరు టార్పెడోస్ను చిత్తు చేసింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో బెంగళూరు టార్పెడోస్పై హైదరాబాద్ బ్లాక్హాక్స్ 3-2తో విజయం సాధించింది. ఐదు సెట్ల పాటు హౌరాహౌరీగా సాగిన మ్యాచ్లో 15-13తో తొలి సెట్లో బెంగళూరు పైచేయి సాధించినా.. ఆ తర్వాతి వరుస సెట్లలో 15-10, 18-16తో హైదరాబాద్ బ్లాక్హాక్స్ మెరిసింది.
నాల్గో సెట్లో బెంగళూర్ 16-14తో పుంజుకున్నా.. నిర్ణయాత్మక ఐదో సెట్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ 15-11తో దంచికొట్టింది. సీజన్లో మూడో విజయంతో పాయింట్ల పట్టికలో బ్లాక్హాక్స్ ఐదో స్థానానికి చేరుకుని సెమీఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బ్లాక్హాక్స్ ఆటగాళ్లలో శిఖర్ సింగ్, యుడి యమమోటో అద్భుతంగా ఆడారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరుపు విజయం సాధించిన బ్లాక్హాక్స్ ఆటగాళ్లను ఆ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్, బెంగళూర్ మ్యాచ్కు ప్రముఖ పాప్ సింగర్ స్మిత హాజరై అభిమానులను అలరించారు.