నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మంత్రిని… నన్నే ఆపుతారా?
శాసనమండలిలోకి వెళ్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహను ‘సార్ ఇది సీఎం వెళ్లే దారి. వేరే వైపు నుంచి వెళ్లండి’ అంటూ సెక్యూరిటీ సూచించారు. ‘మరి ఎలా వెళ్లాలి. నేను మంత్రిని. నన్ను ఆపుతావా?’ అంటూ సెక్యూరిటీపై దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యేలను అడ్డుకున్న భట్టి గన్మెన్లు
అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న భట్టి గన్మెన్లు వారిని అడ్డగించారు. దీంతో ‘సీఎం ఛాంబర్ ముందు కూడా ఇలా ఆపరు’ అంటూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో ఎమ్మెల్యే విజయ రమణారావుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన్ను కూడా భట్టి ఛాంబర్లోకి గన్మెన్లు వెళ్లనివ్వలేదు.
మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తూ…
అసెంబ్లీలో తన మొబైల్ ఫోన్తో కోర్టు ఎమ్మెల్యే సంజయ్ వీడియో తీశారు. గమనించిన మార్షల్స్ వీడియో తీయొద్దని వారించారు. తీస్తే ఏమవుతుంది? అని మార్షల్స్ను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
అధికార పక్షం వైపే….
గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో అధికార పక్షం వైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ప్రతిపక్షం వైపు కూర్చోవాలని కాలే యాదయ్యను పాడి కౌశిక్రెడ్డి కోరారు. ఇటువైపే కూర్చుంటానని తేల్చిచెప్పిన కాలే యాదయ్య. పార్టీ ఫిరాయింపు విషయంలో ఇటీవలనే పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం విదితమే.
బీజేపీ ఎల్పీలోకి రండి…వస్తే లేని పోని వార్తలొస్తాయ్…
అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేలు, కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. బీజేపీ ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్లి కూర్చున్నారు. ‘సస్పెండ్ అయిన తర్వాత వారి కార్యాలయంలో ఎలా కూర్చున్నారు? బయటకు రండి’ అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ‘మీరూ లోపలికి రండి’ అంటూ ఆహ్వానించారు. ‘లోపలికి వస్తే లేనిపోని వార్తలొస్తాయి’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తూ కేటీఆర్ వెళ్లిపోయారు.
సభాపర్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



