చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన బీసీ జేఏసీ నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని కోరింది. ఈ నెల 15, 16 తేదీల్లో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరవాలని కోరారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వంలో పెద్దలతో పాటు పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులను కలిసి బీసీ బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.



