Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబుక్‌ ఫెయిర్‌లో అలరించిన బాలోత్సవం

బుక్‌ ఫెయిర్‌లో అలరించిన బాలోత్సవం

- Advertisement -

విద్యార్థులకు పర్యావరణంపై చిత్రలేఖనం పోటీలు

నవతెలంగాణ – ముషీరాబాద్‌
హైదరాబాద్‌ ఎన్‌టీఆర్‌ స్టేడియం జరుగుతున్న 38వ తెలంగాణ బుక్‌ ఫెయిర్‌లో శనివారం అందెశ్రీ ప్రాంగణంలో తెలంగాణ బాలోత్సవ కార్యక్రమాలు అలరించాయి. అందెశ్రీ రచించిన ”జయ జయహే తెలంగాణ” పాటతో ప్రారంభమై ”ఎదుగుతున్న యువతరమా ఒకసారి ఆలోచించు” అంటూ యువకులను రాజకీయాల్లోకి ఆహ్వానం పలుకుతూ సాగింది. అలాగే అమ్మాయిల సమస్యల మీద పాటలతో మంత్రస్‌ రాగాలయ నృత్య సాంస్కృతిక సంస్థ వారిచే నృత్య రూపకాలు ప్రదర్శించారు. దాదాపు 100 మంది వివిధ పాఠశాలల విద్యార్థులకు పర్యావరణంపై చిత్రలేఖనం పోటీలు నిర్వ హించారు. 3 నుంచి 6వ తరగతి వరకు జూనియర్స్‌గా, 7 నుంచి 10 తరగతి వరకు సీనియర్స్‌గా విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో అనేక రాష్ట్రాల నుంచి అనేక భాషలలో ఉన్న సాహిత్యాన్ని అందిస్తున్న బుక్‌ ఫెయిర్‌లో తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లలు పర్యావరణంపై ఇంత చక్కటి చిత్రాలు గీయడం గొప్ప విషయమన్నారు. బాల చెలిమి ఎడిటర్‌ ఎం.వేదకుమార్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఒక ఉద్యానవనం అయితే ఇక్కడ సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు.. అందాన్ని.. సుగంధాన్ని వెదజల్లుతున్న పువ్వుల్లా ఆహ్లాదాన్ని కలిగిస్తూ అందెశ్రీ ప్రాంగణానికి గౌరవం పెంచారన్నారు. ప్రముఖ బాల సాహితీవేత్త, శని నిర్మాత వేదకుమార్‌ మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు పేపర్‌తో రంగు రంగుల బొమ్మలు, పక్షులను తయారు చేసే కార్యక్రమం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందన్నారు. కార్యక్రమాల్లో ప్రముఖ మెజీషియన్‌ చక్కపు వెంకట్‌ రమణ, సైకాలజిస్ట్‌ మమత, తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుజావతి, తెలంగాణ బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఎన్‌.సోమయ్య, సభ్యులు పీఎన్‌కే బ్రాహ్మణి, మహేష్‌ దుర్గే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -