నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది కి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు, సాధారణ పరిశీలకులు గౌతమి, సమక్షంలో నిర్వహించారు. గురువారం వీ.సీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని ఒక్కో మండలం వారీగా ఆలేరు, ఆత్మకూరు, బొమ్మలరామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. జిల్లాలోని 153 గ్రామ పంచాయతీల సర్పంచ్, 1286 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1441, ఓ.పీ.ఓలు 1500 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డీపీఓ విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ ఎ డి ప్రశాంత్ రెడ్డి లు పాల్గొన్నారు.



