నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ లో శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా వందలాది భక్తులు తరలి వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. భక్తులందరూ సాంప్రదాయం–ఆచారాలను పాటించారని నిర్వాహకులు సంగాయప్ప తెలిపారు. మహారాష్ట్ర,కర్ణాటక ప్రాంతం నుండి కూడా పెద్ద యెత్తున భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అగ్నిగుండం ల వందల సంఖ్యలో పాల్గొనడం విశేషం. మొదటి రోజు నుంచే ఆలయ ప్రాంగణం పూజలతో కిక్కిరిసిపోయింది.
భక్తులు భజనలు, హారతులతో శ్రీ వీరభద్ర స్వామిని దరిచేరి తమ కోరికలు తీర్చాలని ప్రార్థించారు. రెండవ రోజు జరిగిన అన్నదాన మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రసాదం స్వీకరించారు. మూడవ రోజు నిర్వహించిన అగ్నిగుండం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తమ మనోకామనలు నెరవేరుతాయని విశ్వసిస్తూ స్వామి వారిని స్మరించుకున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో పసుపు పూయించడం, కన్యానోత్సవం, పల్లకి సేవ- ప్రతి కార్యక్రమం భక్తి వాతావరణాన్ని మరింత పెంచింది. గ్రామస్థులు సమిష్టిగా నిర్వహించిన ఈ మహోత్సవాలు మద్నూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా జరగడం విశేషం.



