రెండేండ్ల తరువాత కేసీఆర్ను గెలిపించే లక్ష్యంతో పనిచేయాలి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి కమిట్మెంట్, క్యారెక్టర్లేని వ్యక్తి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పోచారంపై తీవ్ర వ్యాఖ్యలు
భువనగిరిలో సర్పంచ్లకు అభినందన సభ
నవతెలంగాణ-భువనగిరి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గలీజ్ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను, వార్డు సభ్యులను గురువారం భువనగిరిలో ఘనంగా సన్మానించి అభినందించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో పోటీపడి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం పార్టీకి వెయ్యి ఏనుగుల బలం చేకూరిందన్నారు. పలు గ్రామాల్లో కాంగ్రెస్ గుండాలు మాటు వేసి దాడి చేసి అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. యాదాద్రి జిల్లాలో వచ్చిన ఫలితాల స్ఫూర్తితో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు గెలిచినా అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.
పార్టీ శ్రేణులు మనస్పర్ధలు వీడి.. సంఘటితంగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కమిట్మెంట్, క్యారెక్టర్ లేని వ్యక్తి అని విమర్శించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరానని నేరుగా చెబుతున్నా స్పీకర్కు కనబడలేదన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఆడనో, మొగోళ్లో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పోచారం శ్రీనివాస్రెండ్డి బీఆర్ఎస్లో స్పీకర్, మంత్రి పదవి పొందారని గుర్తు చేశారు. చావు కాలానికి పార్టీ మారడం ఏందో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రర్రావు, కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్గౌడ్కు కేసీఆర్ మీద ప్రేమ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ పెట్టడంతోనే వచ్చిందన్నారు. దేశంలో నాలుగు శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశ పంచాయతీ కమిటీ నుంచి 30శాతం జీపీ అవార్డులు పొందడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత లేక జనవరిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రతి జిల్లాలో పార్టీ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గెలుపుతోపాటు రెండేండ్ల తర్వాత కేసీఆర్ను గెలిపించే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని కోరారు. పార్టీ కార్యాలయాలలో నిరుపేదలకు శుభకార్యాలు చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ సర్పంచ్లను ఎవరైనా వేధించినా, అక్రమంగా తొలగించినా వారి తరపున న్యాయపోరాటం చేయడానికి ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అడ్డుమారి గుడ్డిసూటిగా గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి సీఎం అయ్యారు అని ఎద్దేవా చేశారు. ఆయన కమీషన్లు వచ్చే పనులు చేస్తారు తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని విమర్శించారు.
ఢిల్లీకి కప్పం కట్టడానికే ఆయన ఉన్నాడని ఆరోపించారు. మూసీ సుందరీకరణకు కేసీఆర్ 36 ఎస్టిపి మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఆ ప్రాజెక్టు రూ.16 వేల కోట్లతో పూర్తి చేయొచ్చు అని, దాన్ని రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల కోట్లకు పెంచుతూ.. కమీషన్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, క్యామ మల్లేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థల మాజీ అధ్యక్షులు డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



