కాప్ సదస్సులో బ్రెజిల్ ప్రతిపాదన
బెలెమ్ : ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తూ ప్రప్రథమంగా ఆరోగ్య హిత పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను బ్రెజిల్ ప్రతిపాదించింది. పర్యావరణ పరిరక్షణ కోసం బ్రెజిల్లోని బెలెమ్లో జరుగుతున్న భాగస్వామ్య పక్షాల సదస్సు (కాప్ 30)లో ఈ మేరకు ప్రత్యేక నివేదికను ఆతిథ్యం దేశం సమర్పించింది. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ప్రభావాలకు వ్యతిరేకంగా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలను బలోపేతం చేయడానికి నిర్దిష్ట చర్యలను బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ప్రణాళికలో ప్రతిపాదించింది. ముఖ్యంగా ఇటువంటి దాడులకు గురయ్యే తరగతులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఉద్ఘాటించింది.
వాతావరణం, ఆరోగ్య డేటాను పర్యవేక్షించడం, విపత్తులు ఎదురైనా వాటిని తట్టుకునేలా ఆర్యోగ రంగంలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం, దుర్బలమైన కమ్యూనిటీల పట్ల సంరక్షణ కొనసాగించడం ఈ మూడు అంశాల వారీగా ప్రణాళిక అమలు చేయాల్సి వుంటుందని ప్రతిపాదించింది. బ్రిటన్, ఈజిప్ట్, అజర్బైజాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లతో సహా పలు దేశాలతో కలిసి బ్రెజిల్ ఈ ప్రణాళికను రూపొందించిందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రి అలెగ్జాండర్ పదిల్లా చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టే ఈ ప్రణాళిక చాలా దేశాలకు తక్షణ మనుగడకు సంబంధించిన అంశమని మంత్రి కాప్ సదస్సులో స్పష్టం చేశారు.



