నవతెలంగాణ-హైదరాబాద్: గత శుక్రవారం అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో రేగిన భారీ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తూ ప్రస్తుతం 65 వేల ఎకరాలకు పైగా దహించింది. ఈక్రమంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ‘గిఫోర్డ్’ గా పేర్కొనే ఈ కార్చిచ్చు ప్రస్తుతం 65 వేల ఎకరాలకు పైగా విస్తరించి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. లాస్ ఏంజెలెస్, వెంచురా, కార్న్ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీల్లోని నివాసితులతోపాటు పొరుగునున్న లాస్ వెగాస్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో పలు సూచనలు జారీ చేశారు. ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోనివారిని తరలిస్తున్నారు.
మరోవైపు … మంటలను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం నాటికి 3 శాతం మాత్రమే అదుపులోకి తీసుకురాగలిగామని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల కారణంగా అడ్డంకులు తప్పడం లేదన్నారు. మంటల నేపథ్యంలో చుట్టుపక్కల రహదారులను కూడా అధికారులు మూసేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఈ కార్చిచ్చు కారణంగా ముగ్గురు గాయపడ్డారు. వారికి అధికారులు వైద్య సేవలు అందించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక విమానంలో తరలించారు. ఇంకొన్ని రోజుల్లో వాతావరణం మరింత వేడి ఎక్కువవనున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.