– 2047 నాటికి సాధిస్తాం
– ఈ ఏడాది రెండంకెల వృద్ధి లక్ష్యం : ఎల్ఐసీ ఎండీ, సీఈఓ ఆర్ దొరైస్వామి వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ప్రతీ ఒక్కరికీ జీవిత బీమాను చేర్చాలని నిర్దేశించుకున్నామని ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఎండీ, సీఈఓ ఆర్ దొరైస్వామి తెలిపారు. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యంగా పెట్టుకున్నామని మంగళవారం ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో దొరైస్వామి తెలిపారు. సెప్టెంబర్తో ముగియనున్న రెండో త్రైమాసికంలో పాలసీల విక్రయాల్లో మరింత వృద్ధి నమోదు కానుందన్నారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, నాన్-పార్టిసిపేటింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి పాలసీ అమ్మకాల ప్రీమియం 9.45 శాతం వద్ధితో రూ.54,238 కోట్లకు చేరింది. ఇది 2024-25లో రూ.49,543 కోట్లుగా ఉంది. 2026 జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కొత్త బిజినెస్ ప్రీమియం (ఎన్సీపీ)19.78 శాతం పెరిగి రూ.11,337 కోట్లకు చేరింది. 2026 మార్చి నాటికి ఐదారు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ఎల్ఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే విధంగా కృత్రిమ మేధా (ఏఐ)ను పాలసీ సేవలు, క్లెయిమ్ ప్రాసెసింగ్లో ఉపయోగించుకోవాలని ఎల్ఐసి యోచిస్తోంది. గడిచిన జూన్ త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభాలు 9.61 శాతం పెరిగి రూ.10,461 కోట్లుగా చోటు చేసుకుంది. మొత్తం ప్రీమియం ఆదాయం 15.27 శాతం వృద్ధితో రూ.1.14 లక్షల కోట్లకు చేరింది.