ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం హైదరాబాద్లో ని తెలంగాణ భవన్లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదని చెప్పారు. అన్నదాతలకు బోనస్, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు కూడా అందట్లేదని అన్నారు. ఎరువుల కోసం క్యూలో నిలబడి రైతులు చనిపోయే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.73వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల ఖాతాలో వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు.
రెండు లక్షల ఉద్యోగాలు, యువతులకు స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ పేరు చెప్పి.. ఆ డబ్బులు పురుషుల నుంచి లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా.. వేలాది ఇండ్లను నేలమట్టం చేస్తున్నదని మండిపడ్డారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా.. పేదల ఇండ్లు కనిపిస్తే కూల్చేస్తోందని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే జరుగుతుందని తాము ముందే చెప్పినా, ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కనీసం తమ పదవి కాలంలోనైనా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.



