Sunday, October 19, 2025
E-PAPER
Homeపరిశోధనమరుగునపడిన వీర శాసనం

మరుగునపడిన వీర శాసనం

- Advertisement -

నల్గొండ జిల్లా పానుగల్లులోని తెలంగాణ వారసత్వశాఖ మ్యూజియంలో అపురూపమైన శిల్పాలు, శాసనాలు, పరికరాలు సేకరించి, భద్రపరచివున్నాయి. మ్యూజియం ప్రాంగణంలో నిలిపిన వీరశిలలలో ఏలేశ్వరం నుంచి తెచ్చిన, శాసనంతో కనిపించిన ఒక వీరశిలను కొత్త తెలంగాణ చరిత్రబందం సభ్యుడు వోరుగంటి వేంకటేశ్‌ గుర్తించాడు. ఈ వీరుడు కుడిచేత బల్లెం, ఎడమచేత డాలు ధరించి, డాకాలు ముందుమోపి శత్రువులను వధిస్తున్నాడు. అతని కాళ్ళ నడుమ శత్రువీరుడు పడివున్నాడు. మరొకరు నిలబడి పోరుచేస్తున్నాడు. వీరునికి కుడివైపు సిగ, కుండలాలు, హారగ్రైవేయకాలు, జంధ్యం, నడుమున దట్టీ, దండకడియాలు, కంకణాలు, కడియాలు, పాంజీబులు అలంకరించబడివున్నాయి.
ఈ వీరశిలపై చెక్కివున్న శాసనం 10వ శతాబ్దానికి చెందినదని, క్రీ.శ.996లో వేయించిన 21 పంక్తుల తెలుగన్నడలిపి, తెలుగుభాషాశాసనం వల్ల అరియరిమ్మ కుమారరాజ్యంలోని దవలందికి చెందిన మల్లయ కొమండివరదియ ఆనతిమేరకు కకయ్య అనే వీరుడు కాలిమడమ తిప్పకుండా యుద్ధం చేసి, వీరస్వర్గమలంకరించాడని తెలుస్తున్నదని, ఈ శాసనాన్ని పవకోజు కొడుకు సరస్వత్త చెక్కాడని ఆ శాసనాన్ని చదివిన కొత్త తెలంగాణ చరిత్రబందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ అన్నారు.
శాసనపాఠం:

  1. సకవర్షంబు
  2. లు 918 సం
  3. వత్సర స్రాహి
  4. శ్రీయ్యరియ
  5. ఱిమ్మవరి
  6. కొమరాజ్య దే
  7. స దవలన్ది మ
  8. ల్లయ కొమన్డీ వ
  9. ఱడియ విలడి
  10. పూనికి దప్ప కకయ్య
  11. ననిడాద బొడిచి స
  12. గ్గొమునకు జని
  13. విరియన్న కొస
  14. నమవడినిద
  15. కొమ్మపయిని
  16. వేఇంచిన ప
  17. వకొజు నిరియ
  18. ..రిమగడస
  19. రస్వత్త చేసిన
  20. పని
    క్షేత్ర సందర్శన: వోరుగంటి వేంకటేశ్‌, కొత్త తెలంగాణచరిత్రబందం
    చారిత్రక వివరణ: శ్రీరామోజు హరగోపాల్‌, కొత్త తెలంగాణచరిత్రబందం కన్వీనర్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -