– అదనపు సిబ్బందిని కేటాయించాలి
– అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులివ్వాలి
– కేరళ, తమిళనాడు తరహాలో 14రకాల వస్తువులు ఇవ్వాలి : సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేష్
– ఎర్రమంజిల్ సివిల్ సప్లయ్ కార్యాలయం ఎదుట ధర్నా, డిప్యూటీ కమిషనర్కు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో రేషన్ కార్డు దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞపి చేసింది. అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. నగరంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, ఈ సేవలో దరఖాస్తులు పెట్టుకున్నారని తెలిపారు. అర్హులైన వారికి వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ప్రజలకు చాలా అన్యాయం చేసిందని, బైకు, కారు ఉన్నాయన్న కారణంతో పదేండ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రేషన్ కార్డులను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుంటి సాకులతో కార్డులు తొలగించే చర్యలు చేపట్టొద్దన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయని, ఈ దరఖాస్తుల విచారణను సివిల్ సప్లయ్ సిబ్బంది మాత్రమే చేస్తున్నారని, సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల విచారణ ఆలస్యం అవుతోందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకొని అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు. కొత్తగా పెండ్లయిన, పిల్లల పేర్లు నమోదు చేసుకోవాల్సిన, రేషన్ కార్డులు లేని కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయన్నారు. కొత్తగా పెండ్లయిన ఆడపిల్లలకు తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్న పేరు తొలగించుకుంటేనే కొత్త అప్లికేషన్ తీసుకుంటామన్న నిబంధన చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డునే పరిగణలోకి తీసుకుంటున్నారని, అందువల్ల పాత రేషన్ కార్డులో పేరు కట్ అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులో నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) పార్టీ కోరుతున్నదని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఇస్తున్న విధంగా ప్రతి రేషన్ కార్డుపైనా 14 రకాల వస్తువులు ఇవ్వాలని కోరారు. అనంతరం పార్టీ ప్రతినిధుల బృందం డిప్యూటీ కమిషనర్ చంద్ర ప్రకాష్ను కలిసి వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను రెండు నెలల్లోపు పరిశీలన చేసి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్, ఎం.శ్రీనివాసరావు, కెఎన్. రాజన్న, కె.నాగలక్ష్మి, ఎం.దశరథ్, ఎం.మహేందర్, నగర కమిటీ సభ్యులు పద్మ, వరలక్ష్మి, జి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES