నవతెలంగాణ-హైదరాబాద్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో మస్క్ కీలక పాత్ర షోషించారు. డోజ్ శాఖ బాధ్యతలు చేపట్టి అమెరికా వృథా వ్యయానికి కట్టడి చేశారు. అంతేకాకుండా వేల సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాల్లో పలు ఉద్యోగాలకు కోత పెట్టారు. ఇద్దరు స్నేహాం సజావుగా సాగుతున్న వేళ బిగ్ బ్యూటిపుల్ బిల్లు వారి మధ్య చిచ్చు రేపింది.బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత డోజ్ శాఖ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. టెస్లా బాస్ను ట్రంప్ పూర్తిగా పక్కన పెట్టేశారు.ఇప్పుడు వైట్హౌస్ విందుకు మస్క్ను ఆహ్వానించకుండా ఆయన ప్రత్యర్థి అయిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ను ట్రంప్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. దీనిపై మస్క్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
మెరికాలోని టెక్ సంస్థల అధిపతులు, సీఈవోలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా విందు ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి అమెరికా కాలమానం ప్రకారం అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం లో ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్తో కలిసి ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ టెక్ సంస్థలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. అయితే, ఈ విందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన్ని ట్రంప్ ఆహ్వానించలేదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ పార్టీపై టెస్లా బాస్ తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తనకు ఆహ్వానం అందిందని, కానీ వెళ్లలేకపోయినట్లు చెప్పారు. ‘ట్రంప్ విందుకు బిల్గేట్స్ను ఆహ్వానించారు. కానీ, ఎలాన్ మస్క్ను పిలవలేదు’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆ పోస్ట్కు స్పందించిన మస్క్.. ‘నాకు ఆహ్వానం అందింది. కానీ వెళ్లలేకపోయాను. నా తరఫున నా ప్రతినిధి వెళ్లారు’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మస్క్ స్పందన నెట్టింట వైరల్ అవుతోంది.