Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఓసీకి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి

ఓసీకి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి

- Advertisement -

– రాష్ట్ర ఇంధన ప్రిన్స్‌పల్‌ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌
– భూపాలపల్లి జిల్లా తాడిచర్ల-1 కోల్‌ బ్లాక్‌ ఓపెన్‌కాస్ట్‌ మైన్‌ పరిశీలన
నవతెలంగాణ-మల్హర్‌రావు

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం తాడిచెర్లలోని కాపురం బ్లాక్‌-1 ఓపెన్‌కాస్ట్‌ మైన్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. మంగళవారం జెన్కో సీఎండీ హరీశ్‌, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఏఎమ్మార్‌ సీఎండీ మహేశ్వర రెడ్డి, సీఈఓ ప్రసాద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌ రెడ్డి, థర్మల్‌, కోల్‌ డైరెక్టర్లతో కలిసి తాడిచర్ల-1 కోల్‌ బ్లాక్‌ ఓపెన్‌కాస్ట్‌ మైన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మైనింగ్‌ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు వంటి అంశాలను వివరించారు. మైనింగ్‌ ప్రాంతం నుంచి తాడిచర్ల గ్రామాన్ని, వాహన ప్రాంగణం, యంత్రాలను, ఫీడర్‌ బ్రేకర్‌ను పరిశీలించారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం పంపిణీ, పునరావాస చర్యలు వంటి విషయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎమ్మార్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయాలని నవీన్‌ మిట్టల్‌ అధికారులకు సూచించారు. అనంతరం తాడిచర్ల నుంచి కేటీపీపీ వరకు కన్వేయర్‌ బెల్ట్‌ నిర్మాణం, రవాణామార్గం, దూరాభారాలపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు కన్వేయర్‌ బెల్ట్‌ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, రహదారి మార్గం, భద్రతా చర్యలు, అవసరమైన నిర్వహణ ప్రక్రియపై వివరాలు అందించారు. కన్వేయర్‌ బెల్ట్‌ నిర్మాణం పూర్తయితే రహదారి రవాణాపై భారం తగ్గి సమర్థవంతంగా బొగ్గు పంపిణీ జరుగుతుందని తెలిపారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా రానున్న రోజుల్లో నిరంతరాయ విద్యుత్‌ సరఫరా జరగాలని ఆయన సూచించారు. కేటీపీపీలో 28 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో థర్మల్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, కోల్‌ డైరెక్టర్‌ రాగ్యా, విద్యుత్తు శాఖ ఈడీ లక్ష్మయ్య, కేటీపీపీ సీఈ శ్రీ ప్రకాష్‌, ఎస్‌ఈ ముత్యాలరావు, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, ఏఎంఆర్‌ సీనియర్‌ మేనేజర్‌ కేఎస్‌ఎన్‌ మూర్తి, జెన్కో జీఎం మోహన్‌రావు, ఏఎమ్మార్‌ అధికారులు, జెన్కో అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -