ఈ యూనివర్సిటీతో గ్లోబల్ లీడర్గా తెలంగాణ : మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాదాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటి ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరఫున ఆ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు వల్ల తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ లీడర్గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీకి పూర్తి స్థాయి చట్టపరమైన గుర్తింపు లభించిందని తెలిపారు.
ఈ యూనివర్సిటీని 310 ఎకరాల్లో రూ. 500 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ఖనిజ సంపదకు నెలవైన కొత్తగూడెం ప్రాంతాన్ని విద్యాహబ్గా మార్చే లక్ష్యంతో, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేడాది డిసెంబర్లో ప్రారంభించారని తెలిపారు. 1978లో స్థాపించిన కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్…తర్వాతి కాలంలో ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. డిసెంబర్ 2025లో సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వర్సిటీకి, తాజా చట్ట సవరణ ద్వారా పూర్తి స్వయంప్రతిపత్తి లభిస్తుందన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలకు నివాళిగా ఈ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినట్టు తెలపారు. ప్రపంచంలో ఎర్త్ సైన్సెస్ కోసం ప్రత్యేక వర్సిటీలు ఉండడం చాలా అరుదు అని గుర్తు చేశారు. సింగరేణి గనులు, గోదావరి నది, అటవీ సంపద ఉన్న కొత్తగూడెం ప్రాంతం విద్యార్థులకు ఇది ఒక లివింగ్ లాబొరేటరీగా మారబోతున్నదని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న బీటెక్ కోర్సులతోపాటు, కొత్తగా బీఎస్సీ (జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్), ఎంఎస్సీ కోర్సులను ప్రవేశ పెడతామని తెలిపారు. ఈ చట్టబద్ధత వల్ల యూనివర్సిటీకి సొంతంగా కరికులమ్ రూపొందించుకునే స్వేచ్ఛ, యూజీసీ నిధులు, మరియు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం లభిస్తోందని వివరించారు. సింగరేణి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈయూరివర్సిటీని ఆడంబరంగా ప్రారంభించారని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దక్షిణాసియా దేశాల నుంచి విద్యార్థులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించాలని కోరారు.



