ఎల్బాక, పడిగాపురానికి రాకపోకలు బంద్..
చింతల్ క్రాస్ వద్ద జంపన్న వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి
బారికేడ్లు ఏర్పాటుచేసిన జిల్లా పంచాయతీరాజ్ అధికారి(డిపిఓ) దేవరాజ్
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చింతల్ క్రాస్ వద్ద ఉన్న జంపన్న వాగు నిన్నటి నుండి పొంగిపొర్లుతుంది. మంగళవారం సాయంత్రం నుండి కురిసిన వర్షానికి మేడారం జంపన్న వాగు కొద్తదిగా తగ్గింది. కానీ నార్లాపూర్ చింతల్ క్రాస్ వద్ద లో లెవెల్ బ్రిడ్జి ఉండడంతో రెండు రోజుల నుండి పొంగిపొర్లుతుంది.
బుధవారం ఉదయం నుండి రాకపోకలు బంద్ అయ్యాయి. ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంగలమ్మడుగు నీరు ఇప్పుడే చేరుతుంది. కొంగల మడుగు ఎక్కువ ప్రవహిస్తే ఈ రెండు ఆదివాసి గ్రామాలు జలదిగ్బంధంలో నిలిచిపోతాయి.
చింతల్ క్రాస్ జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి
మేడారం జాతర పేరు మీద కోట్ల రూపాయలు డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. తాత్కాలిక మరమ్మతులో పనులకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. మేడారం జాతరకు, జాతర అనంతరం ఎల్బక, పడిగాపూర్ గ్రామాలకు, దానిపై నిరంతరం భక్తులు కూడా రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా బహుళార్థ ప్రయోజనాలు కలుగుతాయి, కనక నార్లాపూర్ చింతల్ క్రాస్ వద్ద ఉన్న జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల ప్రజలు రాకపోకలు బంద్ అయి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు. మంత్రి సీతక్క ఇట్టి విషయాన్ని పరిశీలించి చింతల్ క్రాస్ వద్ద గల జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన డిపిఓ దేవరాజ్
మంగళవారం సాయంత్రం నుండి బుధవారం రాత్రి వరకు కురిసిన వర్షానికి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మండలంలోని చింతల్ క్రాస్ వద్ద జంపన్న వాగు, ఊరట్టం వద్ద తూములవాగు పొంగిపొర్లాయి. దీంతో అక్కడికి గురువారం ములుగు జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) దేవరాజ్ సందర్శించి జంపన్న వాగు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని పంచాయతీ కార్యదర్శులకు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు సూచించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కనుక గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయాలని గ్రామపంచాయతీ అధికారులను సూచించారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. అంతేకాకుండా మండలంలోని అధికారులు కూడా జంపన్న వాగు ముంపు ప్రాంతాల గ్రామాలను పరిశీలించారు. గుంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.