– మాల్యాల వెంగల చెరువు ఎండిపోవడంతో 25 వేల వరకు చేపలు మృత్యువాత
– ప్రభుత్వం ఆదుకోవాలని వృత్తి దారుల వినతి
నవతెలంగాణ-చందుర్తి : ఎండల ప్రభావంతో చెరువుల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది.దీంతో చెరువుల్లో నీరు లేకపోవడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో చేపల వృత్తి దారులు జీవనోపాధిపై ప్రభావం పడడంతో ఆయా కుటుంబాల ఉపాధిపై దెబ్బపడిందని మాల్యాల వెంగల చెరువులో నీరు అడుగంటడంతో చనిపోయిన చేపలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
చేపల పెంపకం దారుల కు లక్షల్లో నష్టం
మాల్యాల గ్రామంలో 75 కుటుంబాలు చేపల వృత్తిపై జీవనోపాధి పొందుతున్నారు. దీంట్లో భాగంగా గత సంవత్సరం 50 వేల చేప పిల్లలను సుమారుగా రూ. లక్ష 30 వేల వరకు ఖర్చుతో కొనుగోలు చేసి చెరువులో పోశారు. ఇందులో25 వేల వరకు చనిపోయినట్లుగా మత్స్యకారుల ద్వారా తెలిసింది. ఆరునెలల వ్యవధిలో కిలో వరకు చేప పెరుగుతే వాటిని అమ్మకానికి సేకరిస్తారు. కానీ చెరువు ఎండిపోవడంతో ఎదుగుదలలోనే అవి మృతి చెందడం వృత్తి దారులకు ఆర్థికంగా తీవ్రనష్టం మని వాపోతున్నారు.
లక్షల ఖర్చులు భరించి చేపలు కొనుగోలు చేసి చెరువులో పోస్తే నీళ్లు లేక 25 వేల చేపల వరకు చేపలు చచ్చిపోయాయి.గత ప్రభుత్వం చేపలను కొనుగోలు చేసి చెరువుల్లో వదిలితే తమకు ఉపాధి ఉండేది కానీ మా సొంత పైసలు పెట్టి చేపలను చెర్లల్లో పోస్తే కనీసం చెరువులోకి నీళ్లు ఇవ్వకేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతో మా ఉపాధి ని దెబ్బతీసింది.నష్టపోయిన మా వృత్తి దారుల ప్రభుత్వం ఆదుకోవాలి.
– మల్లేశం చేపల వృత్తి దారుడు



