సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
మంత్రి తుమ్మలకు తెలంగాణ చేనేత కార్మిక సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, కార్యదర్శి ముషం నరహరి, ఉపాధ్యక్షులు వర్కాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి రూ.16.27 కోట్లు విడుదల చేశామనీ, అందరికీ అమలవుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరే విధంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
చేనేత రుణాలను గుర్తించి లేఖలు ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నా…చేనేత శాఖ జిల్లా అధికారులు దాన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆయా జిల్లాల్లోని పలు ఉదహరణలను వివరించారు. త్రిఫ్ట్ పథకంలో ప్రభుత్వం తన వాటాను జమ చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. నేతన భరోసా పథకాన్ని సరిగ్గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రుణం మాఫీ చేయాలని కోరారు. చేనేత కార్మికులకు హౌస్ కం వర్క్ షెడ్ను ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇవ్వాలన్నారు. నేతన్నలకు పెట్టుబడి సాయం కింద వడ్డీ లేని రుణం రూ. 5 లక్షలు ఇవ్వాలని కోరారు. డూప్లికేట్ చేనేత వస్త్రాలను అరికట్టాలనీ, రిజర్వ్ చేసిన 11రకాల చేనేత వస్త్రాలకు చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వస్త్ర నిల్వలను టెస్కో ఖరీదు చేయాలని కోరారు. గద్వాల జిల్లా రాజోలి, నల్లగొండ జిల్లా చండూర్, నకిరేకల్లో వర్షాకాలంలో మగ్గం గుంటల్లోకి ఊటనీరు చేరిన చేనేత కార్మికులకు స్థాండ్ మగ్గాలు ఇవ్వాలని విన్నవించారు.



