Friday, June 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకులాల సమస్యలను పరిష్కరించాలి

గురుకులాల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

– కార్యదర్శి అలుగు వర్షిణీని విధుల నుంచి తొలగించాలి : ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, లక్ష్మణ్‌ డిమాండ్‌
– సంక్షేమ భవన్‌ ముట్టడి ఉద్రిక్తం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురుకుల విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్న కార్యదర్శి అలుగు వర్షిణీని విధుల నుంచి తొలగించాలని కోరారు. గురుకులాల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో సంక్షేమ భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. సంక్షేమ భవన్‌లోకి ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య తోపులాట, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌లోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు మణికంఠరెడ్డి, లక్ష్మణ్‌ మాట్లాడుతూ గురుకులాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 12 ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని చెప్పారు. అద్దె భవనాల్లో ఉన్న వాటికి అద్దె చెల్లించకపోవడంతో యజమానులు తాళాలు వేస్తున్నారని అన్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సమస్యలను పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఆఫీసు బేరర్లు గ్యార నరేష్‌, రెహమాన్‌, కాసోజు నాగజ్యోతి, నాయకులు చైతన్య యాదవ్‌, సామిడి వంశీవర్ధన్‌రెడ్డి, భాషాబోయిన సంతోష్‌, ముదిగొండ మురళీకృష్ణ, దత్తురెడ్డి, వలమల ఆంజనేయులు, హరీశ్‌, చరణ్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -