– తాండూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా|| సి.సుధారాణి
నవతెలంగాణ-తాండూరు
గ్రామీణ వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఎఫ్పీఓల పాత్ర కీలకమని తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా|| సి.సుధారాణి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్రి హబ్ తాండూర్ లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబెటర్ ఆధ్వర్యంలో ఎఫ్పీఓ డైరెక్టర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రైతులను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయడం, గ్రామీణ వ్యవసాయ రంగంలో నూతన వ్యాపార అవకాశాలకు తోడ్పాటుపై వివరించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సమూహ నిర్మాణం, సమిష్టి మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబెటర్ ప్రాజెక్ట్ ప్రిన్సిపాల్ డా|| సి.సుధాకర్, టీఆర్వీటీ కోఆర్డినేటర్ డా.టి.రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి వ్యవసాయ వ్యాపార అవకాశాలు, విలువ జోడింపు శృంఖలాలు ప్యాకెజింగ్, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే వాస్తవ సమస్యలపై ప్రశ్నలు, సమాధానాల రూపంలో చర్చలు జరిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలను ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. శిక్షణ, మద్దతు విధానాలపై వివరించారు. కాగా, ఈ వర్క్షాప్లో అనేక పరస్పర చర్చలు, వాస్తవిక ఉదాహరణలు, విజయం సాధించిన ఎఫ్పీఓల మోడళ్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు యమున, భారతి, స్వాతి, జిల్లాలోని ఎఫ్పీఓల డైరెక్టర్లు పాల్గొన్నారు.
గ్రామీణ వ్యవసాయ అభివృద్ధిలో ఎఫ్పీఓల పాత్ర కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES