నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ పతనం ఈ రోజు కూడా కొనసాగింది. బుధవారం చరిత్రలో తొలిసారిగా 90 మార్కును దాటిన రూపాయి, ఇవాళ్టి ట్రేడింగ్లో మరో 22 పైసలు నష్టపోయి మరింత బలహీనపడింది. గత ముగింపు 90.19తో పోలిస్తే, గురువారం ఉదయం 90.41 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి వరుసగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలు రూపాయిపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ. 3,692 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) రూ. 4,730 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ ఇంతలా పడిపోతున్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటివరకు పెద్దగా జోక్యం చేసుకోకపోవడం కూడా పతనానికి ఒక కారణంగా కనిపిస్తోంది. రాబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ విషయంపై దృష్టి సారించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. స్వల్పకాలంలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ, దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం వంటి సానుకూల అంశాలు మధ్యకాలంలో మార్కెట్కు మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



