Tuesday, June 3, 2025
E-PAPER
Homeజిల్లాలుతెరవే రెండవ జిల్లా మహాసభలు విజయవంతం..

తెరవే రెండవ జిల్లా మహాసభలు విజయవంతం..

- Advertisement -

– ఆద్యకళను పరిరక్షించుకోవాలి
నవతెలంగాణ – కామారెడ్డి
: తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెండవ మహాసభలను కర్షక్ బి.ఎడ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా తెరవే అధ్యక్షులు సిరిసిల్ల గఫూర్ శిక్షక్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలకు ముఖ్యఅతిథిగా ఆద్యకళ వ్యవస్థాపకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భాష,సాహిత్యం,సంస్కృతుల పరిరక్షణ కోసం తెరవే నిరంతరం కృషి చేస్తున్నదని అందులో భాగంగానే ఆచార్య జయదీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ఆద్యకళను స్థాపించడం జరిగిందన్నారు. గత ఐదు దశాబ్దాలుగా తిరుమల రావు అలుపెరుగకుండా ఆదివాసీ, గిరిజన, జానపద కళాఖండాలు, పనిముట్లు, సంగీత వాధ్య పరికరాలను సేకరించి భావితరాలకు వారసత్వంగా అందించేందుకు జీవితకాలం శ్రమించారని తెలిపారు. అలాంటి ఆధ్యకళకు శాశ్వతంగా మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే కొంతమంది విద్యార్థులను ఎగదోసి ఆద్యకళను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

దీనిని తేరవే తీవ్రంగా ఖండిస్తున్నది అన్నారు. ప్రభుత్వం, ప్రజాస్వామ్యవాదులు, కవులు, రచయితలు స్పందించి ఆద్యకళను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ.. తేరవే ఉద్యమ కాలం నుండి ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని, మారుతున్న సామాజిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రణాళికలను రూపొందించుకుంటూ కార్యక్రమాల రూపకల్పన చేస్తూ ఆచరణలో ఉంచాలని సూచించారు. తేరవే నిబద్ధతతో పని చేస్తున్నందునే గతంలో తేరవేను నిషేధించాలని ప్రయత్నించారని, తెరవే ఏనాడు వెనుకంజవేయ లేదని తెలిపారు. మారుతున్న దేశకాల పరిస్థితుల్లో కవులు, రచయితలు మౌనంగా ఉండడం ప్రమాదకరమని, మరింత నిబద్ధతతో కవులు కలాలతో చైతన్య పరుస్తూ ముందుకు నడిపించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. తెరవే తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే తెలంగాణ అస్తిత్వ, భాషా, సంస్కృతుల పరిరక్షణకు పూనుకోవాలని సూచించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య స్థాపకురాలు విమలక్క మాట్లాడుతూ.. సరిహద్దుల ఆవల శత్రువులతో శాంతి చర్చలు జరుపుతున్న పాలకులు దేశంలో తమ బిడ్డలతో చర్చలు జరపడానికి మాత్రం విముఖంగా ఉన్నారని, తన బిడ్డలను తానే చంపుకునే స్థితికి దిగజారిందని, దేశ సహజ వనరుల్ని, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయటానికే ఆదివాసుల హక్కులను కాలరాస్తూ.. మానవ హాననానికి పూనుకున్నదని తెలిపింది. కవులు, రచయితల పాలకుల గుట్టును బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరవే వివిధ జిల్లాల నుండి వచ్చిన రచయితలు, గాజోజు నాగభూషణం, భూర్ల వెంకటేశ్వర్లు, ఉదారి  నారాయణ, జి లచ్చయ్య,యాదగిరి ఆడేపు లక్ష్మణ్ ,ప్రేమ్ లాల్, నారాయణ గౌడ్,సి వి కుమార్, తోకల రాజేశం, నర్సింహారెడ్డి,  మోహన్,లింగం,రామచంద్రం, విజయశ్రీ, మోహన్ రాజ్, రామచంద్రం  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -