91.72 శాతం పోలింగ్ నమోదు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో..జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం గా పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. ఆదివారం జిల్లాలోని భువనగిరి వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి, రామన్న పేట మండలంలో జరిగిన రెండవ విడుత ఎన్నికల సందర్భంగా 91.72 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.రెండవ విడత ఎన్నికల ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ, కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది, పోలింగ్ అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 17 తేదీన 3వ విడత ఎన్నికలను కూడా అధికారులు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
మొదటి, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు కానీ ఎవ్వరు విజయోత్సవ ర్యాలీలు, జరుపుకోవద్దని,గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా, కోడ్ ముగిసిందని ప్రకటించే వరకు కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పని అన్నారు.



