– జల్సాలకు డబ్బులడిగితే ఇవ్వలేదని ఘాతకం
– మెదక్ జిల్లా సీతానగర్ గ్రామంలో ఘటన
నవతెలంగాణ-పాపన్నపేట
మానవత్వ విలువలు మరిచి జల్సాలకు అలవాటు పడిన యువకుడు.. తన అవసరాల కోసం తండ్రి డబ్బులు ఇవ్వడంలేదన్న కోపంతో కన్న తండ్రినే ఓ కొడుకు హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు ఓ లైన్ మెన్ వద్ద విద్యుత్ పనుల కోసం సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య శేఖమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహానికి, వ్యవసాయానికి కొంత అప్పులయ్యాయి. అంతేకాకుండా, శ్రీకాంత్ జల్సాలకు అలవాటు పడటంతో అప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో డబ్బుల విషయంలో శ్రీకాంత్కు, అతని తండ్రి లక్ష్మయ్యకు తరచూ గొడవలు జరుగుతుండేవి. డబ్బులు ఇవ్వకపోతే చంపుతా అంటూ తరచూ శ్రీకాంత్ తండ్రిని బెదిరించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా లక్ష్మయ్య ఇంటికి రాగానే శ్రీకాంత్ మళ్లీ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శ్రీకాంత్ ఆవేశంలో ముందుగా సుత్తితో తండ్రిపై దాడి చేయగా తల్లి శేఖమ్మ అతని వద్ద నుంచి సుత్తిని లాక్కోవడంతో శ్రీకాంత్ మళ్లీ అక్కడే ఉన్న కర్రతో లక్ష్మయ్య తలపై దాడి చేశాడు. దాంతో లక్ష్మయ్యకు తీవ్ర గాయాలవడంతో వెంటనే కుటుంబీకులు మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. తన భర్త మృతికి కారణమైన కొడుకు శ్రీకాంత్పై చర్యలు తీసుకోవాలని లక్ష్మయ్య భార్య శేఖమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



