రైతులకు ప్రస్తుత అవసరాల మేరకు ఇవ్వండి
పంటకు రెండవ సారి వేయాల్సిన యూరియాను ముందస్తుగానే కొనుక్కోవాలనుకోవడం సరికాదు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లాలో గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా అందుబాటులో ఉందని, రైతులు అనవసర అనుమానంతో పంటకు రెండవసారి వేయాల్సిన యూరియా సైతం ఇప్పుడే కొని పెట్టుకోవాలి అనుకోవడం వల్ల మిగతా రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. గురువారం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం, వాస్తవిక యూరియా నిల్వలను పరిశీలించారు. పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు సకాలంలో యూరియా కొరకు డి.డి.లు కట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.
అనంతరం అక్కడే రైతులతో మాట్లాడారు. ఇంకా ఒక లోడ్ యూరియా తెప్పిస్తే ఈ ప్రాంతంలో అందరికీ సరిపోతుందని రైతులు కలెక్టర్ కు సూచించారు. స్పందించిన కలెక్టర్ వనపర్తి జిల్లాలో గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా వచ్చిందని, పాత నిల్వలు సైతం ఉన్నాయన్నారు. కేవలం మళ్ళీ యూరియా దొరుకుతుందో లేదో అనే భద్యాందోళనతో కొంతమంది రైతులు ప్రస్తుత అవసరానికి మించి కొనడం వల్ల ఇతర రైతులకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. మలి దఫా వేయాల్సిన యూరియా సైతం ఇప్పుడే కొని పెట్టుకోవడం సరి కాదన్నారు.
యూరియా నిరంతరం వస్తూనే ఉంటుంది కాబట్టి రైతుకు అనవసర ఆందోళన పడి ఉదయాన్నే లైన్లో వేచి ఉండాల్సిన పని లేదన్నారు. జిల్లాలో గత సంవత్సరం ఇంతకన్నా తక్కువ యూరియా ఉండిందని కానీ ఎక్కడ సమస్య తలెత్తలేదన్నారు. ఇప్పుడు ఎక్కువ యూరియా అందుబాటులో ఉన్నప్పటికినీ సమస్యలు రావడం ఏమిటని అన్నారు. ఇప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకెళ్లాలని తర్వాత మళ్ళీ తీసుకోవచ్చని రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, పి. ఎ సి.ఎస్ సిబ్బంది, రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు.