ఓటర్ల జాబితా సవరణ మాత్రమే
వెలువడిన ఈసీ ఉత్తర్వులు
న్యూఢిల్లీ : అసోంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది అసోం అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి వున్నాయి. జాతీయ పౌరుల పట్టిక (ఎన్నార్సీ) రాష్ట్రంలో పెండింగ్లో వున్నందున అసోం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను ఈసీ చేపట్టడం లేదు. కేవలం ప్రత్యేక సవరణ మాత్రమే వుంటుంది. అసోంలో 3.3 కోట్ల మంది దరఖాస్తుదారుల జాబితా నుంచి 2019 ఎన్నార్సీ జాబితాలో దాదాపు 19.6లక్షల మంది వ్యక్తులను మినహాయించారు. కానీ ఇప్పటి వరకు తుది నోటిఫికేషన్ వెలువడలేదు. కానీ అసోం ప్రభుత్వం మాత్రం ప్రస్తుత రూపంలోని ఎన్నార్సీని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు , లక్షద్వీప్లలో సర్ చేపట్టను న్నట్టు గత నెల ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వీటిల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ మరియు పశ్చిమబెంగాల్లో 2026లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ 2026లో ఎన్నికలు జరగనున్న అసోంకు విడిగా ఎస్ఎస్ఆర్ను ప్రకటించారు. సాధారణంగా వార్షిక ప్రత్యేక కూలంకష సవరణ (ఎస్ఎస్ఆర్) తో పోలిస్తే అసోంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో మరింత ఎక్కువగా స్క్రూటినీ వుంటుందని సీనియర్ ఈసీ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ కింద బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి వెళ్ళి సమాచారం సేకరిస్తారు గానీ సర్లో జరిగినట్టుగా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు పూర్తిచేయరు. దీనికి బదులుగా బీఎల్ఓల వద్ద స్టేట్మెంట్ 1-3 అని పేర్కొనే మూడు ఫారాలు వుంటాయనిసోమవారం నాటి ఈసీ ఉత్తర్వులు పేర్కొన్నాయి.
అసోంలో ‘సర్’ లేదు
- Advertisement -
- Advertisement -



