అమరావతి : భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు పూర్తయ్యాయని, ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంట్లోనూ చట్టం చేశారని, ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ గవాయ్ ‘ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే అంశంపై ప్రసంగించారు. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం తనకు రావడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.
మహిళలపై అసమానతను రూపుమాపేందుకు జ్యోతి రావ్ ఫూలే ఎంతో కృషి చేశారని, పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళలకు సమానత్వం ఉండాలనేది సుప్రీంకోర్టు విధానమని, న్యాయ రంగంలో మహిళలు రాణిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకిచ్చారని తెలిపారు. ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగారని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో నిఫుణులను అందించే సత్తా భారత్కు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని వెల్లడించారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది న్యాయవ్యవస్థ కీలక బాధ్యత వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ ఉండాలి : సీజేఐ బీఆర్ గవాయ్
- Advertisement -
- Advertisement -



