రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ విజయ్ కుమార్
సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియాస్పత్రి తనిఖీ
నవతెలంగాణ-జోగిపేట
వైద్య సేవలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయకూడదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందోల్ నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని వసతులున్నా సంగారెడ్డికి ఎందుకు రిఫర్ చేస్తున్నారని ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సాధ్యమైనంతవరకు అన్ని కేసులను ఇక్కడే చికిత్స చేయాలని సూచించారు. ముఖ్యంగా నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని, అనవసరంగా సీజేరియన్ శస్త్రచికిత్సలు చేయొద్దని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్యకు ఆదేశించారు. ఈ సందర్భంగా పురుషులు, మహిళల వార్డులు, డయాలసిస్ సెంటర్, అవుట్ పేషెంట్ విభాగంలో రోగుల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. డాక్టర్ల హాజరు రిజిస్టర్ను పరిశీలించిన కమిషనర్, గైర్హాజరైన డాక్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విధుల్లో ఉన్న డాక్టర్లు స్టెథస్కోప్లు, ఆప్రాన్లు ధరించకుండా ఉంటే వారిని ఎలా గుర్తించగలమని ప్రశ్నించిన కమిషనర్, విధిగా స్టెథస్కోప్ ధరించాలని ఆదేశించారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడిన ఆయన, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలు, డాక్టర్లు, సిబ్బంది సేవలు, ఆహార సరఫరా, ఇతర ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల కొరత ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలని, మందుల కోసం రోగులను బయట కొనమని చెప్పరాదని స్పష్టం చేశారు. రోగులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అవసరమైతే ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగించుకోవచ్చని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
వైద్యసేవలో నిర్లక్ష్యం వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



