అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు
రెండోదశలోనూ బీఆర్ఎస్ అద్వితీయ ఫలితాలు
మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సత్తాచాటిన గులాబీ శ్రేణులు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ శ్రేణులు అద్వితీయ ఫలితాలను సాధించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు.రెండో దశలో గెలిచిన గులాబీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో నూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తాచా టారని పేర్కొన్నారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని పల్లె ప్రజలు ఓటు ద్వారా మరోసారి నిరూపించారని తెలిపారు. ప్రభు త్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో నూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రం లో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శన మని వివరించారు. రేవంత్రెడ్డి రెండేండ్ల పరిపాలనా వైఫల్యాలకుతోడు గ్యారెంటీల అమల్లో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయ ని పేర్కొన్నారు.
పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు చెంపపెట్టులాంటివని తెలిపారు. నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే నేడు కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలవకపోవడం అధికార పార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదనీ, రిక్తహస్తమనీ, అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని తెలిపారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.



