రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ఇతర అధికారులతో కలిసి సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీ ఈ ఓ మాట్లాడుతూ.. నూతనంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను చేరవేయాలని సూచించారు. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, ఏ ఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
