నవతెలంగాణ-హైదరాబాద్: మిజోరాంలో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లల్లోకి విపరీతంగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో విద్యార్థుల భద్రతరీత్యా సోమవారం (జూన్ 2) పాఠశాలల్ని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజ్వాల్ డిప్యూటీ కమిషనర్ ఇటి లాల్రెంపుయా ప్రకటించారు.
కాగా, ఆదివారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి లల్దుహోమా ఐజ్వాల్లో సిఎం కాన్ఫరెన్స్లో హాలులో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల విపత్తు నిర్వహణ సంస్థలకు తగిన నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే వర్షాల వల్ల ప్రభావితమైన బాధితులకు తక్షణమే సహయం అందించాలని.. వాటికి సంబంధించి సహాయ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ (డిఎం అండ్ ఆర్) పర్యవేక్షణలో విపత్తు ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
ఈశాన్య భారతంలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయి. వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక అస్సాంలో కొండచరియలు విరిగిపడడం వల్ల ఐదుగురు మృతి చెందారని అస్సాం మంత్రి జయంత మల్లబరువా వెల్లడించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది.