నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా తీవ్ర అవస్థలు పడిన ప్రయాణీకులకు ఊరటనిస్తూ దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా కీలక ప్రకటన చేసింది. సంక్షోభంతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు పరిహారం అందించనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది.
బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తం రూ.500 కోట్లు దాటుతుందని ఇండిగో అంచనా వేసింది. విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు, కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. నష్టపరిహారం అందించే ప్రక్రియను వీలైనంత పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడమే తమ లక్ష్యం అని పేర్కొంది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమానాలను, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపింది. జనవరిలో వారందరినీ సంప్రదించి సజావుగా పరిహారం అందిస్తామని వివరించింది.
ఇప్పటికే ట్రావెల్ వోచర్లు జారీ ….
ఇండిగో ఇప్పటికే వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10 వేలు విలువైన అదనపు ట్రావెల్ వోచర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వోచర్లు డిసెంబర్ 3, 4, 5 తేదీల మధ్య ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని ఇండిగో స్పష్టం చేసింది. ఈ ట్రావెల్ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.



