రోడ్డు వేయాలని అధికారులకు వినతి
నవతెలంగాణ – తాడ్వాయి
ఊరు దాటాలంటే ఏరు దాటక తప్పని స్థితి ఆ గ్రామస్తులది. ఆస్పత్రికి వెళ్లాలన్నా.. సుమారు 30 కిలోమీటర్లు దూరంలో మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. ఈ క్రమంలో మధ్యలో ఒక వాగు దాటాలి. ఇక వర్షాకాలం వచ్చిందంటే.. వాళ్ల కష్టాలు వర్ణాణాతీతం. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆదివాసి మహిళ గుమ్మడి కృష్ణవేణికి ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయం నుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి.
వర్షం బాగా కురుస్తుండడంతో కొద్దిగా ఎలువగానే, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో అల్లిగూడెం నుండి పోచాపూర్ మధ్యలో ఒక వట్టి వాగు ఉంది. వర్షాకాలం కాబట్టి నిన్నటి నుండి వర్షాలు భారీగా కురుస్తుండడంతో ఆ “వట్టివాగు” ఏరులై పారుతుంది. ఆ గర్భిణిని ఆదివాసి గిరిజనులు భుజాలపై ఎక్కించుకొని వాగును దాటించారు. మూడు, నాలుగు గంటల పాటు తీవ్ర వేదన అనుభవించింది ఆ గిరిజన మహిళ. గతంలో బంధాల గ్రామపంచాయతీలో రోడ్లు లేక ఆదివాసీల తీరు వర్ణాణాతీతం. కానీ ఇప్పుడు కొంతమేరకు తారు రోడ్డు వేశారు. ఇంకా వాగు అవతల అల్లిగూడెం, నర్సాపురం (పిఎల్) అనే రెండు ఆదివాసి గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక మగ్గిపోతున్నాయి. ఏటా వర్షాకాలంలో తమకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, మంత్రి సీతక్క స్పందించి ఈ వాగులపై వంతెనలు నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లిగూడెం, నర్సాపూర్ (పి ఎల్) ఆదివాసి గిరిజనులు కోరుకుంటున్నారు.